||సుందరకాండ ||

||పదహేనవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| సవీక్షమాణ స్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీమ్|
అవేక్షమాణశ్చ మహీం సర్వాం తామన్వవేక్షత||1||
స||తత్రస్థః వీక్షమాణః మైథిలీం మార్గమాణః అవేక్షమాణఃచ సః హనుమాన్ తాం సర్వాం మహీం అవేక్షత||
తా|| మైథిలిని వెదుకుతూ ఛూడడానికి అక్కడ కూర్చుని వున్నఆ హనుమంతుడు పరిసర ప్రాంతములు అన్నీ చూడసాగెను
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచదశస్సర్గః

మైథిలిని వెదుకుతున్న ఆ హనుమంతుడు అక్కడ శింశుపా వృక్షముపై కూర్చుని పరిసర ప్రాంతములు అన్నీ మరల మరల చూడసాగెను .

ఆ అశోక వనిక సంతానక లతలతో కూడిన వృక్షములతో శోభిస్తున్నది. దివ్యమైన వాసనలుగల పిల్ల వాయువులతో నిండినది.
ఆ నందనవనముతో సమానముగాగల వృక్షములతో శోభిస్తున్నది. మృగములతో, పక్షుల తో, కోకిలల కిలకిలారావముతో నిండినది. ఆ అశోకవనికలో మేడలు మిద్దెలు కూడా ఉన్నాయి. ఆ అశోకవనిక బంగారురేకులుగలపద్మములతో నిండిన చెరువులతో శోభిస్తున్నది. ఆ అశోకవనిక అనేకమైన ఆసనములతో భూగృహములతో కూడినది. అలాగ అన్ని ఋతువులలో పుష్పించు కుసుమములు పుష్పములు ఫలములు కలది. రమ్యమైన ఉదయభానుని కిరణములను ప్రజ్వలిస్తూ వున్న ఆ అశోకవనమును హనుమంతుడు చూచెను.

ఆ అశోకవనములో వందలకొలదీ పక్షులు వాలడమువలన రాలిపోయిన ఆకులు గల శాఖలతో వున్న వృక్షములు అత్యంత సుందరముగా చిత్రీకరింపబడినట్లు వున్నాయి. ఆ వనము క్రింద నించి పై దాకా పుష్పములతో నిండిన, శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో నిండి యున్నది.

ఆ అశోకవనము బాగా పుష్పములతో విరబూచి పుష్పభారముతో భూమిని స్పృశించుచున్నవా అన్నట్లు వున్న కర్ణికార, కింశుక వృక్షములతో నిండి యున్నది. ఆ వృక్షముల కాంతులతో ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నట్లు వుంది. అక్కడ బారులుగావున్న సుపుష్పితమైన పున్నాగ, సప్తపర్ణ చంపక ఉద్దాలక వృక్షములు శోభించుచున్నాయి. అక్కడ వేలకొలది వున్న అశోకవృక్షములలో కొన్ని బంగారుకాంతులతో శోభిస్తున్నాయి. కొన్ని అగ్నిశిఖలులాగ వున్నాయి.

వివిధ ఉద్యానములతో వున్న ఆ అశోక వనము నందన ఉద్యానము వలె నున్నది. అనేకరంగులుకల ఆ ఉద్యానము కుబేరుని చైత్రరథము అనే ఉద్యానము వలె నున్నది. అతి దివ్యము రమ్యము శ్రియముతో వున్న ఆ ఉద్యానవనము పుష్పములతో జ్యోతిర్గణములతో నున్న రెండవ ఆకాశము వలె నున్నది. వందలకొలది పుష్పములతో నిండి రెండవ సాగరము వలె నున్నది. అన్ని ఋతువులలో పుష్పించు పుష్పములతో, మధుగంధపు వాసనలతో వున్న వృక్షములతో , పక్షుల మృగముల నినాదములతో నిండిన, అనేకమైన గంధములుకల వాయువులతో ఆ వనము మనోరమముగా వున్నది.

ఆ వానరపుంగవుడు ఆ అశోకవనిక మధ్యలో దగ్గరలోనే వేయి స్తంభములతో తెల్లని కైలాసములా వున్న, పగడములతో చేయబడిన మెట్లు కల, బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల, కళ్ళకి మిరుమిట్లు గొలిపే , ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్న ఒక పెద్ద చైత్యప్రాసాదమును చూచెను .

అక్కడ మలినవస్త్రములు ధరించిన రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న ఉపవాసములతో కృశించియున్నదీనముగా మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న శుక్లపక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె నున్న స్త్రీని చూచెను.

పొగచే ఆవృతమైన పొగజ్వాలవలె ఆమెసౌందర్యము స్పష్ఠముగా కానరాక ఉన్నది.

జీర్ణించిన ఒక ఉత్తమ తరగతి పీతవస్త్రమును ధరించియున్న ఆవిడ, అలంకారములు లేకుండా పద్మములు లేని తామరకొలను వలె నున్నది. ఆమె దుఃఖములో మునిగి తలవంచుకొనియున్నది. తపస్వినివలె నున్నది. అంగారకగ్రహముచేత పీడింపబడిన రోహిణి వలె నున్నది.

ఆమె దుఃఖభారముతో నీళ్ళతో నిండిన కళ్లతో ఉపవాసములతో కృశించి దీనముగా ప్రతిక్షణము ధ్యానములో ఉన్నది.

ఆమె ప్రియమైన జనులు కానరాక రాక్షసీగణములనే చూస్తూ , ఆమె తన మందనుంచి విడిపోయి వేటకుక్కలతో చుట్టబడియున్న ఆడ జింకవలె ఉండెను. జఘనము వఱకు వేలాడుచున్న నల్లని పామువలె ఉన్న ఒంటిజడతో వున్న ఆమె, శరద్ ఋతువులో వున్న వృక్షపంక్తితో కూడిన భూమివలె నున్నది.

అధికమైన మలముతో కృశించియున్న ఆ విశాలాక్షిని చూచి, ఈమె సీతయా అని తర్కించ సాగెను. ' ఈ అంగన ఆ కామరూపి అగు రాక్షసుని చేత తీసుకోపోబడిన ఆమె రూపము కలది గా కనపడుచున్నది' అని అనుకొనెను.

పూర్ణ చంద్రునిబోలి వున్న , ఆకర్షణీయమైన కనుబొమ్మలతో, అందమైన వృత్తాకారములో ఉన్న పయోధరములతో , అన్ని దిశలలో చీకటిని పారద్రోలు కాంతిని విరజిల్లుచూ, నల్లని జుట్టుగల దేవిని, దొండపండువంటి పెదవులుకల , సన్నటి నడుము కల ,పద్మము యొక్క రేకులవంటి కళ్ళు కల, మన్మధుని రతీ దేవి వలె నున్న సీతాదేవి ని హనుమంతుడు చూసెను.

ఆమె పూర్ణచంద్రుని వెన్నెలవలె జగత్తులోని సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రురాలు. నియమవతి అయి తపస్వివలె ఆమె భూమి మీద కూర్చుని ఉన్నది. భయపడుతూ బుసలు కొడుతున్న భుజగేంద్రుని పత్నివలె నిట్టూర్పులు విడుచుచున్న ఆమె, పెద్ద శోకముతో ప్రకాశవిహీనముగా వున్నది.

ఆమె ధూమ్రజాలముచేత కప్పబడిన అగ్నిశిఖవలెనున్నది.
సందిగ్ధమైన అర్థముగల స్మృతి వాక్యమువలె నున్నది.
తరిగిపోయిన ఇశ్వర్యము వలె నున్నది.
అధికమైన అవిశ్వాసముచే చెడిన శ్రద్ధవలెనున్నది.
కార్యము ఫలించని ఆశవలె,
విఘ్నము కలిగిన సిద్ధివలె ,
కలుషమైన బుద్ధివలె నున్నది.
అసత్యమగు అపవాదముచే క్షీణించిన కీర్తివలె వున్న్ది.

రాక్షసునిచే అపహరింపబడి రాముని ఏడబాటుతో కృశించి వున్నది. లేడి కన్నులతో ,భాష్పములతో నిండిన నల్లని కనుబొమ్మల కల అమె ప్రసన్నముకాని వదనముతో మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుచుచూ వున్నది ఆ అబల. మలినమైన అంగములతో దీనముగా నున్న, ఆభరణములకు అర్హురాలైనప్పటికీ ఆభరణములు లేకుండా వున్న ఆమె నల్లని మేఘములతో కప్పబడిన నక్షత్రరాజుని వలెనున్నది.

మననము చేయకుండా వున్నందువలన మరుగుపడిన విద్య పునశ్చరణ లో కలుగు సందేహము వలె, ఆ సీతను చూచి అతని మనస్సులో పదే పదే ఈమె సీతయా అని సందేహము కలుగుచుండెను.

అలంకారము లేక సంస్కారరహితమై కృశించి ఉన్నఆమెను, అర్ధము లోపించిన శబ్దమును కష్టముగా అర్థముచేసికొనినట్లు, ఆమె యే సీత అని అతి దుఃఖముతో తెలిసికొనగలిగెను.

అప్పుడు రాముడు వైదేహి అంగములలో ఏ ఏ ఆభరణములు కీర్తించెనో వానితో శోభించుచున్న అంగములను చూచెను.

సుకృతమైన కుండలములతో, చక్కగా ఉన్న శ్వదంష్ట్రములతో, హస్తములమీద మణులతో రూపొందించబడిన ఆభరణములు, చిరకాలము ఉపయోగించడము వలన మాసిపోయి, శరీరము మీద మచ్చలు చూసెను.

రాజపుత్రి విశాలాక్షి అగు ఆమెని చూచి ఈమె సీత అని అనేక కారణములతో అలోచించ సాగెను.

'అవి రామునిచే వర్ణింపబడినవే అని అనుకుంటాను. అప్పుడు క్రిందపడవేసినవి నాకు ఇప్పుడు కనపడుట లేదు. మిగిలిన ఆభరణములను మాత్రమే చూచుచున్నాను. ఆ పచ్చని బంగారు వన్నెగల ఆ శుభమైన ఉత్తరీయమును అప్పుడు సీత జారవిడచగా వానరులచే చూడబడినది. తీసుకుపోబడుతూ ధరణీ తలము మీద చప్పుడు చేస్తూ పడవేయబడిన అమూల్యమైన ప్రధానమైన ఆభరణములను వానరులు చూచిరి. చాలాకాలము ధరింపబడిన ఈ వస్త్రము క్లిష్టముగా ఉన్నది. అయినప్పటికీ దాని రంగు కాంతి అప్పుడు ఎలాగవున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది. ఈ బంగారువన్నెగల అవయవములతో నున్న రాముని పట్టమహిషి అపహరింపబడినప్పటికీ ఆయన మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నది'.

' తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యము,
తనపై అధారపడిన స్త్రీకనక దయ,
భార్య పోయినందువలన శోకము ,
తనప్రియురాలు కానరావకపోవడము వలన మదన బాధతో
అలాగ నాలుగు విధములుగా రాముడు పరితపిస్తున్నాడు.

ఆ దేవియొక్క రూపము అంగముల సౌష్టవము ఆయన యొక్క రూపమునకు తగినట్లే ఉన్నాయి. ఈ దేవియొక్క మనస్సు ఆయనపై అయనయొక్క మనస్సు ఈమె పై ప్రతిష్టింపబడియున్నాయి.అందువలనే ఆ ధర్మాత్ముడు ఈమె యూ క్షణమైన జీవించకలుగుతున్నారు'.

'రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు అంటే కష్టమైన పని సాధించకలిగాడన్నమాట. ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము మహాబాహువులు కల రాముడు ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది".

ఈ విధముగా ఆ వాయునందనుడు ఆ సీతను చూచి రాముని మనస్సులో తలచుకొని ఆయనను ప్రశంశించి మనస్సులో ఆనందపడెను.

ఈ విధముగా రామాయణములో పదహేనవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః|
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్||55||
స|| పవనసంభవః తదా సీతాం దృష్ట్వా ఏవం హృష్టః మనసా రామం జగాం తాం ప్రభుం ప్రశశంస చ||
తా|| ఆ వాయునందనుడు అలా సీతను చూచి రాముని మనస్సులో తలచుకొని ఆయనను ప్రశంశించి ఈవిధముగా మనస్సులో ఆనందపడెను.
||ఓమ్ తత్ సత్||